వరుసగా కమెడియన్ పాత్రలు పోషిస్తున్న కమెడియన్ ‘30 ఇయర్స్ ఇండస్ట్రీ’ పృధ్వీ దర్శకుడిగా మారబోతున్నాడు. అయితే ఇది రియల్ లైఫ్ లో కాదు, రీల్ లైఫ్ లో భాగంగానే..! అక్కినేని ఫ్యామిలీ నటుడు సుశాంత్ హీరోగా తెరకెక్కుతోన్న ‘ఆటాడుకుందాం రా’ సినిమాలో టీవీ సీరియల్ దర్శకుడి పాత్రను పోషిస్తున్నానని, సినిమా నిండా అన్న గారు బ్రహ్మానందం, వెన్నెల కిషోర్లతో కలిసి నవ్వుల బాంబులను పేల్చామని చెప్పుకొచ్చారు.
తన డైరెక్షన్లో వచ్చే సినిమాల పేర్లు… “మాంగల్యానికి మంగళ హారతి, గంపెడాశ” వంటి వైరెటీగా ఉంటాయని, తన సినిమాలు విడుదల కాకముందే రివ్యూలు వచ్చేస్తాయని, అలా టీవీ సీరియల్ తీస్తుండగా హీరో గారు ‘విలన్’ పాత్ర కోసం రావడం… నాగార్జున లాగా అందంగా ఉన్నావు, నువ్వు విలన్ ఏంటి అని తాను అనడం… అక్కడ నుండి… అంటూ ఫ్యాన్స్ ని ఊరించిన పృధ్వీ, హీరో సుశాంత్ ఈ సినిమాలో అందంగా ఉన్నారని, బాగా చేసాడని ప్రశంసించారు.
పృధ్వీ చేసిన కామెడీనే ‘ఆటాడుకుందాం రా’ సినిమాకు హైలైట్ గా నిలిచినట్లుంది. ఈ సినిమా ధియేటిరికల్ ట్రైలర్లో కూడా పృధ్వీపై కట్ చేసిన షాట్స్ ఎక్కువగా ఉండడం విశేషం. సినిమా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తిగా పోషించాల్సిన పాత్ర వస్తే పృధ్వీ చెలరేగిపోతాడని నాటి ‘ఖడ్గం’ నుండి మొన్నటి ‘భలే మంచి రోజు’ సినిమాలో పోషించిన మల్లెపుష్పం రామారావు వరకు చెప్పకనే చెప్పాయి. దీంతో ‘ఆటాడుకుందాం రా’లో కూడా ఓ ఆట ఆడేసుకుంటే… సుశాంత్ పండగ చేసుకున్నట్లే!