PSPK28 Pawan Kalyan - Harish Shanar - Mythri Movie Makersపవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు హరీష్ శంకర్ ల కాంబినేషన్లో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్న చిత్రానికి కళా దర్శకునిగా ‘ఆనంద్ సాయి’

పరిచయం వాక్యాలు అవసరం లేని,లబ్ధ ప్రతిష్ఠుడైన కళా దర్శకుడు ఆయన..పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘తొలిప్రేమ’ చిత్రం మొదలుకుని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘ఎవడు’ చిత్రం వరకు దగ్గర దగ్గరగా నూరు చిత్రాల వరకు, ఆయా చిత్రాలలో తన కళాదర్శకత్వ నైపుణ్యంతో ఎన్నో ప్రశంసలు, మరెన్నో విజయాలు, రాష్ట్ర ప్రభుత్వాల పురస్కారాలు అందుకున్నారు. గత ఐదు సంవత్సరాలకు పైగా యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ చీఫ్ ఆర్కిటెక్ట్ గా విధులు నిర్వహిస్తున్న ఆయన, ఆలయ నిర్మాణ పనులు తుది దశకు చేరుకోవటంతో తిరిగి కళాదర్శకునిగా సినిమాలకు పునరంకింతం అవనున్నారు.

కొంత కాలం విరామం తరువాత ఆయన ప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్,దర్శకుడు హరీష్ శంకర్ ల కాంబినేషన్లో ప్రతిష్ఠాత్మకంగా, భారీ స్థాయిలో, భారీ వ్యయంతో నిర్మించనున్న చిత్రానికి కళా దర్శకునిగా బాధ్యతలు నిర్వహించనున్నారు. ఆయన తొలి చిత్రం, సుదీర్ఘ విరామం తరువాత ఆయన కళా దర్శకునిగా బాధ్యతలు స్వీకరిస్తున్న చిత్రం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిదే కావటం గమనార్హం.

ఈ మేరకు మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మాతలు నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్,దర్శకుడు హరీష్ శంకర్ లు కళా దర్శకుడు ‘ఆనంద్ సాయి’ గార్కి ఘన స్వాగతం పలుకుతూ, గౌరవ పూర్వకంగా తమ చిత్రానికి కళా దర్శకునిగా ఆయన పేరును అధికారికంగా ప్రకటిస్తూ సామాజిక మాధ్యమాల వేదికగా ప్రచార చిత్రాన్ని విడుదలచేశారు.