మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ మరో సారి మీడియా ముందుకు వచ్చి జగన్ సర్కారు మీద విమర్శలు గుప్పించారు. పోలవరం ప్రాజెక్టులో 41 మీటర్ల వరకే నీటిని నిల్వ చేయాలనే.. జగన్ సర్కార్ ఆలోచన దుర్మార్గమైనది అని ఎట్టి పరిస్థితుల్లో అలాంటి తప్పుడు ఆలోచనలు చేయొద్దని చెప్పుకొచ్చారు. డీపీఆర్ ప్రకారం పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేసుకోవాలని సూచించారు.
ఆర్అండ్ఆర్ ప్యాకేజీని కేంద్రంతో పోరాడి సాధించుకోవాలని సూచించారు. రాజీపడితే రాష్ట్రానికి తీరని ద్రోహం చేసినవారు అవుతారని ఉండవల్లి హెచ్చరించారు. పోలవరం విషయం పై కేంద్రం ఏం చెప్పిందో బహిరంగ పరచారాలని, ప్రాజెక్టు కు సంబంధించిన పనులలో ఆర్అండ్ఆర్ ప్యాకేజీకి కూడా కేంద్రం డబ్బులు ఇవ్వాలని ఉండవల్లి మరో సారి చెప్పారు.
‘పోలవరం ప్రాజెక్టు విమర్శగా తీసుకోకండి.. పోలవరం ప్రాజెక్టుకు నిధులు ఇస్తారో.. ఇవ్వరో కేంద్రంతో చెప్పించాలి’ అన్నారు. నిజాలు చెప్పకుండా జగన్ జనాల్ని మభ్యపెడుతున్నారని ఉండవల్లి ఆరోపించారు. మరోవైపు… తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్టులు అక్రమైనవని వాటిని అడ్డుకోవాలని ఉండవల్లి పిలుపునిచ్చారు.
“గోదావరిపై తెలంగాణ ప్రాజెక్టులకు అనుమతులు లేవు. తాగు నీటి ప్రోజెక్టుల పేరుతో అక్రమ ప్రాజెక్టుల నిర్మాణం చేపడుతున్నారు. తెలంగాణ ప్రాజెక్ట్లకు అభ్యంతరం చెబితే జైల్లో పెడతానని కేసీఆర్ హెచ్చరించారు. పోలవరం పూర్తి అయ్యే వరకు తెలంగాణ ప్రాజెక్టులకు అభ్యంతరం చెప్పాలి’’ అని ఉండవల్లి సూచించారు.