తిరుపతి వేదికగా ఏపీకి ప్రత్యేక హోదాపై గళం విప్పిన టాలీవుడ్ అగ్ర నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ నవ్యాంధ్రలో పెను రాజకీయ చర్చకే తెర లేపారు. ఇప్పటికే పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై పలు పార్టీలకు చెందిన నేతలు తమ తమ అభిప్రాయాలను తెలుపగా, తాజాగా వైసీపీ ప్రధాన కార్యదర్శి, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు వేణుంబాక విజయసాయిరెడ్డి కూడా స్పందించారు.
“పవన్ కల్యాణ్ విశ్వసనీయతపై తమకు అనుమానాలున్నాయని, ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో బీజేపీపై చూపిస్తున్న దూకుడును పవన్ కల్యాణ్ టీడీపీపై ఎందుకు చూపడం లేదని, చంద్రబాబు ప్రభుత్వం లక్ష కోట్ల రూపాయలకు పైగా అవినితికి పాల్పడినా… చంద్రబాబుపై పవన్ కల్యాణ్ ఆచితూచి మాట్లాడుతున్నారని” పవన్ ను టార్గెట్ చేసుకుని కీలక వ్యాఖ్యలు చేసారు. అయితే ఈ వ్యాఖ్యలకు ‘జనసేన’ అభిమానులు సోషల్ మీడియా వేదికగా కౌంటర్లు కూడా వేస్తున్నారు.
పవన్ కళ్యాణ్ ప్రముఖంగా ప్రస్తావించింది ‘ప్రత్యేక హోదా’ పైన మాత్రమేనని, టిడిపికి సంబంధించి మున్ముందు సభలలో మాట్లాడుతాను, ఇప్పుడు కాదని స్పష్టంగా చెప్పారని, ‘ప్రత్యేక హోదా’ అనేది కేంద్రం పరిశీలనలో ఉన్న విషయమని, అందుకే టిడిపిని కాకుండా కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపిని టార్గెట్ చేసారని, ఈ మాత్రం అవగాహన లేకుండానే రాజకీయాలు చేస్తున్నారు గనుక, వైసీపీ పరిస్థితి ఇలా ఉందని ‘జనసేన’ అభిమానులు మండిపడుతున్నారు. ‘పవన్ మీలాగా కుటిల కులరాజకీయాలు చేయడానికి రాలేదు, కేవలం ప్రజల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని వచ్చారు’ అంటూ జగన్ పార్టీపై పడుతున్న సెటైర్లకు కొదవలేదు.