ఉద్యమాల పేరుతో ప్రజలను బలితీసుకునే సంస్కృతి మన దేశ రాజకీయాలకు కొత్తేమీ కాదు. ఒక్కో సమయానికి ఒక్కో ఉద్యమం పుట్టుకొస్తూ భావోద్వేగాలతో చెలగాటం ఆదుకుని, చివరకు అది ఆత్మహత్య వరకు దారి తీయడం షరామామూలుగా మారింది. బహుశా ఒక మనిషి ప్రాణం విలువను ఇంత హీనంగా మన రాజకీయాలు తప్ప మరొకటి శాసించవేమో! తాజాగా ఏపీలో మండుతున్న కాపు రిజర్వేషన్ ఉద్యమంలో తొలి ‘బలిదానం’ నమోదైంది.
తూర్పు గోదావరి జిల్లా కలెక్టరేట్ ఆవరణలో కాపులను బీసీల్లో చేర్చాలంటూ సూరిబాబు అనే సామాన్యుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కాపులకు అన్యాయం చేయద్దని, ప్రభుత్వం మొద్దు నిద్ర వీడాలని కోరుతూ ఓ సూసైడ్ నోట్ ను రాసిన సూరిబాబు ప్రాణాలు కుల రాజకీయాలకు బలయ్యాయి. ఆదివారం జరిగిన ఆందోళన ఇంకా ఓ కొలిక్కి రాక ముందే తాజాగా, ఈ సంఘటన చోటు చేసుకోవడంతో పరిస్థితులు ఎక్కడికి దారితీస్తాయోనన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది.