tdp-mp-galla-jayadev narrow-escape-from-accident‘అమరరాజా బ్యాటరీస్’ ఎండీ, గుంటూరు లోక్ సభ సభ్యుడు గల్లా జయదేవ్ వరుసగా ప్రమాదాల్లో చిక్కుకుంటున్నారు. ఇటీవలే తన సొంత నియోజకవర్గంలో ఓ బ్రిడ్జిని ప్రారంభించేందుకు వెళ్లిన సందర్భంలో కారు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో గల్లా జయదేవ్ కు ఎలాంటి గాయాలు కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. తాజాగా కృష్ణాజిల్లాలోని గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి గుంటూరు వెళుతున్న సందర్భంలో జరిగిన ప్రమాదంలో గల్లా జయదేవ్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు.

గుంటూరులో ఐటీసీ నిర్మించనున్న స్టార్ హోటల్ కు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా భూమి పూజ జరిగింది. స్థానిక ఎంపీ హోదాలో ఈ కార్యక్రమానికి గల్లా జయదేవ్ హాజరు కావాల్సి ఉంది. విమానంలో గన్నవరం చేరుకున్న జయదేవ్… అక్కడి నుంచి రోడ్డు మార్గం మీదుగా గుంటూరు బయలుదేరారు. ఈ క్రమంలో రోడ్డుపై కనిపించిన ఓ కుక్కను తప్పించే క్రమంలో గల్లా కారు అదుపు తప్పి, రోడ్డు పక్కగా ఉన్న మట్టి గుట్టను ఢీ కొట్టింది.

ఈ ప్రమాదంలో గల్లాకు స్వల్ప గాయాలు కావడంతో, ఎంపీని హుటాహుటిన విజయవాడ తరలించిన అనుచరులు ప్రథమ చికిత్స చేయించారు. దీంతో హోటల్ భూమి పూజ కార్యక్రమానికి గల్లా హాజరు కాలేకపోయారు. అయితే వరుసగా జరుగుతున్న ప్రమాదాలపై పార్టీ వర్గాలు, అనుచరులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.