‘ఎంసెట్-2’ లీకేజీ అంశంపై టీ-డీడీపీ నేత రేవంత్ రెడ్డి తెలంగాణా ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేస్తూ… తెలంగాణా సర్కార్ పై ప్రశ్నల వర్షం కురిపించారు. ఎంసెట్ పరీక్ష నిర్వహణ కోసం చేపట్టిన బయోమెట్రిక్ విధానంలో 2500 మంది విద్యార్థుల బయోమెట్రిక్ పని చేయకపోతే ఆ బాధ్యతను చేపట్టిన సంస్థపై తెలంగాణా సర్కార్ ఎందుకు చర్య తీసుకోలేదు? పరీక్ష సంబంధించి ఆన్లైన్ విధాన ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వ సంస్థను కాదని ప్రైవేటు వ్యక్తులకు సర్కారు ఎందుకు అప్పజెప్పింది?
తెలంగాణ మంత్రులు కడియం శ్రీహరి, లక్ష్మారెడ్డి, తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డిపై ప్రభుత్వం విచారణకు ఆదేశించాలని, అసలు వీరిపై ఎందుకు విచారణ చేపట్టడం లేదు? విచారణ జరిపిస్తే కేసీఆర్ కుటుంబ సభ్యులు ఇందులో ఉన్నారనే నిజం తెలుస్తుందని భయపడుతున్నారా? ఉన్నత విద్యామండలి ఛైర్మన్ పాపిరెడ్డిని భర్తరఫ్ చేయాలని, ఆన్లైన్ విధానం కోసం టెండర్ ఇచ్చిన అంశం, ఓఎంఆర్ షీట్ల ప్రింటింగ్, బయోమెట్రిక్ విధానంలో లోపాలు, ఢిల్లీలో ప్రశ్నపత్రం ప్రింటింగ్ అయిన అంశాలపై సమగ్రంగా విచారణ చేపట్టాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.
ప్రభుత్వం అసమర్థత వల్లే విద్యార్థులకు ఇన్ని కష్టాలు వస్తున్నాయని, ఓ వైపు విచారణ జరుగుతోంటే మరోవైపు లీకేజీ జరగలేదని మంత్రి లక్ష్మారెడ్డి బాధ్యతారాహిత్యపు వ్యాఖ్యలు చేశారని అన్నారు. విచారణ జరుగుతోన్న సమయంలో స్వయంగా మంత్రే అటువంటి వ్యాఖ్యలు ఎందుకు చేయాల్సి వచ్చింది? లీకేజీ అంశంలో రాష్ట్ర ప్రభుత్వమే ముద్దాయి అని ఆరోపించిన రేవంత్, రాష్ట్ర ప్రభుత్వాన్నే ముద్దాయిగా కోర్టులో బోనులో నిలబెట్టాలని కోరారు.
విద్యార్థుల పట్ల ప్రభుత్వానికి నిబద్ధత లేదని, ఈ కుట్రలో కేసీఆర్ కుటుంబ సభ్యులు లేరని ముఖ్యమంత్రి నిరూపించుకోవాలని సవాల్ విసిరారు. విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన రేవంత్, విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇటీవల కాలంలో సైలెంట్ గా ఉంటున్న రేవంత్, ఎంసెట్ లీక్ అధికారికం కావడంతో, ఒక్కసారిగా ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.