mytri-movie-makers-ruling-tollywoodచేపట్టిన తొలి ప్రాజెక్ట్ తోనే టాలీవుడ్ (బాహుబలి మినహాయింపు) ఆల్ టైం ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసిన “శ్రీమంతుడు” సినిమా నిర్మాతల వ్యవహారం తెలుగు సినీ పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారింది. తొలి చిత్రమే మహేష్ బాబు వంటి సూపర్ స్టార్ డేట్లు సంపాదించిన ఈ ‘మైత్రి’ త్రయం, తాజాగా జూనియర్ ఎన్టీఆర్ తో “జనతా గ్యారేజ్” సినిమాకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే.

మహేష్, తారక్ ల తర్వాత తామూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఒక సినిమాను నిర్మిస్తామని ఇప్పటికే సదరు సంస్థ నుండి ఓ ప్రకటన వచ్చింది. ఇలా వరుసగా పెద్ద హీరోలతో చిత్రాలను నిర్మించడం బహుశా టాలీవుడ్ మోస్ట్ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు వలన కూడా కాలేదు. పవన్ తర్వాత కూడా మరో పెద్ద స్టార్ ను తమ ఖాతాలో వేసుకున్నారన్నది లేటెస్ట్ సెన్సేషన్.

‘బాహుబలి – ది కన్ క్లూజన్’ సినిమాతో బిజీగా ఉన్న ప్రభాస్ ను ఇటీవల ‘మైత్రి మూవీ మేకర్స్’ కలిసి ఒక చిత్రానికి ఒప్పందం కుదుర్చుకున్నారని, ఇందుకు గానూ భారీ మొత్తం అడ్వాన్సు కూడా చెల్లించారని టాలీవుడ్ వర్గాల సమాచారం. ప్రస్తుతం చేస్తున్న సినిమా తర్వాత ప్రభాస్ ‘రన్ రాజా రన్’ సినిమా దర్శకుడు సుజిత్ తో ఒక చిత్రంలో నటించనున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా మైత్రి మూవీస్ ఎంటర్ కావడంతో ప్రభాస్ సినిమా షెడ్యూల్స్ లో మార్పు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

మహేష్, జూనియర్, పవన్, ప్రభాస్… ఇలా టాలీవుడ్ టాప్ హీరోలతో వరుసగా సినిమాలు నిర్మించడమనేది సాధారణ విషయం కాదు. మరి అంతటి కార్యాన్ని ఇలా సుసాధ్యం చేసుకోవడం పట్ల “మైత్రి” త్రయపు విజయ రహస్యమేమిటో? తాజా పరిణామాలతో భవిష్యత్తు తెలుగు సినీ పరిశ్రమను ఏలబోయే నిర్మాతలు వీరేనా? అన్న రీతిలో చర్చలు జరుగుతున్నాయి.