Sivaji Blames Narendra Modi - Venkaiah Naidufor special status‘ఏపీకి ప్రత్యేక హోదా అవసరం లేదు’ అన్న కేంద్రమంత్రి వ్యాఖ్యలపై ఏపీ ప్రత్యేక హోదా సాధన సమాఖ్య అధ్యక్షుడు, సినీ హీరో శివాజీ ఆవేదనతో కూడిన ‘కడుపు మంట’ చల్లారేలా లేదు. ప్రధానమంత్రి మోడీ మొదలుకుని, తెలుగు కేంద్రమంత్రుల వరకు అందరినీ ఏకిపారేస్తున్న శివాజీ… ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ద్రోహం చేసిన ఏ రాజకీయ పార్టీ బతికి బట్టకట్టలేదన్న చరిత్రను పునరుద్ఘాటించారు.

ఆంధ్రప్రదేశ్ అంటే మోడీకి కక్ష, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారంటే మోడీకి కసి. పిచ్చి వ్యూహాలు, రాజకీయ కుయుక్తులు పన్నుతున్న మోడీకి ‘ఏపీ’ అంటే ‘అడ్వాన్స్ డ్ పీపుల్’ అని తెలియదేమో! ప్రధానమంత్రి గురించి మాట్లాడుకోవడానికి మనకు సిగ్గుండాలి, ఆయన కేవలం ‘ఆర్టీఫీషియల్’ ప్రధానమంత్రి, ప్రాక్టికల్ ప్రధానమంత్రి కాదు’ అని మోడీని ఉద్దేశించి తీవ్రంగా స్పందించారు.

మోడీ చేసే జిమ్మిక్కులు ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్మరు, ఎవరైతే బీజేపీ వైపు వెళతారో వారికి ఉన్న విలువ కూడా పోతుంది. అందులో సమస్యే లేదు, ఏపీ ప్రజలకు మోడీపై నమ్మకమే లేదు. బీజేపీతో ఉంటే టీడీపీ కూడా దెబ్బ తినడం ఖాయం, ఏపీకి సంబంధించిన ప్రతి అంశంలోనూ తీవ్ర అన్యాయం చేస్తున్న బీజేపీ నుంచి టీడీపీ బయటకు వచ్చి కేంద్రంపై ఎదురుదాడి చేయాలి… అంటూ పిలుపునిచ్చారు. బహుశా ‘ప్రత్యేకహోదా’పై ప్రధాని నుంచి ఒక ప్రకటన వెలువడిన తర్వాత ఇది జరుగుతుందేమో… అన్న భావాన్ని వ్యక్తపరిచారు.

‘తెలంగాణ సాధన కోసం ఆ రోజున కేవలం ఇద్దరే ఇద్దరు కేసీఆర్ మరియు విజయశాంతిలు లోక్ సభను సాగనివ్వకుండా అడ్డుపడ్డారు… తెలంగాణ సాధించుకున్నారు. ‘మనసువిప్పి పోరాటానికి సిద్ధం కండి, ప్రత్యేక హోదా ఎందుకు రాదో తేలుద్దాము’ అంటూ అన్ని రాజకీయ వర్గాలకు శివాజీ పిలుపునిచ్చారు.