shock to t TDP Errabelli Dayakar Rao joins TRSతెలుగుదేశం పార్టీని మానసికంగా కృంగదీస్తున్న టీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ మరో భారీ షాక్ ఇచ్చారు. ఇటీవలే జరిగిన వివేక్ పార్టీ మార్పు నుండి టిడిపి తేరుకోక ముందే మరో పెద్ద తలకాయ “కారు” గాలంలో పడిపోయారు. దీనిపై సమాచారాన్ని కేసీఆర్ కూతురు, నిజామాబాద్ ఎంపీ కవిత ట్విట్టర్ ద్వారా తెలియజేసారు.

టీ-టీడీఎల్పీ నేత, పాలకుర్తి ఎమ్మెల్యే అయిన ఎర్రబెల్లి దయాకరరావు పార్టీ మార్పుపై గతంలో హల్చల్ చేసిన వార్తల విషయం రాజకీయ విజ్ఞులకు తెలిసిన విషయమే. అయితే, “తానూ పార్టీ మారను, రాజకీయాల్లో ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతాను” అని ఆ సమయంలో వివరణ ఇచ్చుకున్నారు. కానీ అదే ఎర్రబెల్లి దయాకరరావు తాజాగా న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో తెలంగాణా మంత్రి హరీష్ రావుతో భేటీ అయ్యారు. దీంతో ఎర్రబెల్లి పార్టీ మార్పు ఖరారయ్యింది. ఎర్రబెల్లితో పాటు గ్రేటర్ పరిధిలోని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కూడా ‘గులాభీ’ కండువా కప్పుకోబోతున్నారని కవిత స్పష్టం చేసారు.

ఇక్కడ మరో ట్విస్ట్ ఏమిటంటే… ఎర్రబెల్లి టీఆర్ఎస్ లో చేరికపై టిడిపిలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. సీనియర్ నాయకుడిగా ఉన్న ఎర్రబెల్లి పార్టీ ఉపయోగపడే దాని కంటే పార్టీకి చేస్తున్న నష్టమే ఎక్కువని అభిప్రాయ పడుతున్న వారి సంఖ్య గణనీయంగానే ఉంది. ఈ పరిణామంతో తెలంగాణా బాధ్యతల విషయమై అధినేత చంద్రబాబుకు కూడా ఓ స్పష్టత వస్తుందని, రేవంత్ రెడ్డి పట్టాభిషేకం జరుగుతుందన్న ప్రచారం ఊపందుకుంటోంది.