ram charan busy with 3 upcoming moviesశ్రీను వైట్ల దర్శకత్వంలో నటించిన ‘బ్రూస్ లీ” చిత్రం దారుణ పరాజయం తర్వాత రామ్ చరణ్ తేజ సినిమాలకు కాస్త విరామం ప్రకటించారు. ఫ్యామిలీతో కలిసి హాలిడే ట్రిప్ లను ఎంజాయ్ చేసిన చెర్రీ ఎట్టకేలకు తన తదుపరి చిత్ర షూటింగ్ ను ప్రారంభించబోతున్నారు.

ఫిబ్రవరి 21వ తేదీన ‘తనిఒరువన్’ సినిమా రీమేక్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమా తర్వాత విలక్షణ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో జూన్ నుండి మరో సినిమాకు సన్నద్ధం చేసుకున్నారు. అలాగే అంతకు ముందు ప్రారంభించి ఆపివేసిన కొరటాల శివ దర్శకత్వంలో మరో సినిమాకు ఈ ఏడాది చివర్లో శ్రీకారం చుట్టనున్నారు.

ఇలా మూడు చిత్రాలు ముగ్గురు వినూత్న దర్శకులతో చెర్రీ పని చేయాలనుకోవడం అతని సినిమాల ఎంపికలో పెద్ద మార్పును సూచిస్తుందని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. సుకుమార్ వైవిధ్యం గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది… అలాగే ‘శ్రీమంతుడు’ ద్వారా తన స్టామినా, ప్రతిభను నిరూపించుకున్న కొరటాల శివను ఎంచుకోవడం అనేది… చెర్రీ తనపై ఉన్న ‘కమర్షియల్ చిత్రాల హీరో’ అన్న ముద్రను తొలగించుకోవడానికే అని సినీ విశ్లేషకులు వ్యక్తపరుస్తున్న అభిప్రాయం.

ఇక, అభిమానులకు ఇంత కంటే ఆనందం ఏముంటుంది… లాంగ్ గ్యాప్ తీసుకున్న రామ్ చరణ్, మరో లాంగ్ గ్యాప్ లేకుండా కష్టపడడానికి సిద్ధం కావడంతో రాబోతున్న రెండేళ్లల్లో తన ఫ్యాన్స్ కు కావలసినన్ని సినిమాలను చెర్రీ ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాడని చెప్పకనే చెబుతున్నారు.