ఇండియాలో సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం ఎంత నేరమో, థాయ్ ల్యాండ్ లో సెల్ ఫోన్స్ లో గేమ్స్ ఆడుతూ డ్రైవింగ్ చేయడం కూడా అంతే నేరం. దీంతో థాయ్ ల్యాండ్ పోలీసులు ఈ తరహా జనాలపై దృష్టి సారించారు. ముఖ్యంగా ఇటీవల చాలా క్రేజ్ గా మారిపోయిన ‘పోకెమాన్ గో’ గేమ్ వలన యాక్సిడెంట్లు అవుతుండడంతో, మొబైల్ గేమ్స్ ఆడుతూ వాహనాలు నడుపుతున్న వారిపై థాయ్ ల్యాండ్ పోలీసులు దృష్టి సారించారు.
ఈ నేపథ్యంలో 42 మందిని కూడా అరెస్ట్ చేశారు. వాహనాలు నడుపుతూ సెల్ ఫోన్ వినియోగించడం, ‘పోకేమాన్ గో’ గేమ్ ఆడటం థాయ్ ల్యాండ్ ట్రాఫిక్ నిబంధనలకు విరుద్ధం కావడంతోనే వారిని అరెస్ట్ చేసామని తెలిపారు. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద వాహనాలు ఆగిన సందర్భంలో ‘పోకేమాన్ గో’ ఆడుతూ తమ కంట పడిన వారిని అరెస్ట్ చేశామని, వారి వద్ద నుంచి సెల్ ఫోన్లు తీసేసుకున్నామని, ఈ గేమ్ ఆడుతూ దొరికిన వారికి జరిమానా విధిస్తామని అన్నారు.