సర్దార్ గబ్బర్సింగ్’ సినిమా సెట్స్కి మెగాస్టార్ చిరంజీవి వెళ్లడం వెనుక అనేక కధలు చక్కర్లు కొడుతున్నాయి. ఉన్నట్లుండి సెట్స్కి చిరు ఎందుకెళ్లినట్టు? దీని వెనుక ఏమైనా మతలబు వుందా? ఇటీవల కాలంలో చిరంజీవి – పవన్ ను ఇలా కలిసిన సందర్భాలు లేవు. అయితే దీనికి వెనుక కథ వేరేగా ట్రేడ్ వర్గాల్లో చక్కర్లు కొడుతున్న వార్తలు. మెగా బ్రదర్స్ ఇద్దరూ అప్పుడప్పుడు కలవడం, ఫొటోలు దిగడం షరా మామూలే! ఇందులో కొత్తగా చెప్పేదేమీ లేదు. అయితే మెగాస్టార్ మాత్రం ఓ పని మీదే పవన్ దగ్గరకు చేరారని అంటున్నారు.
చిరంజీవి 150వ సినిమా ‘కత్తి’ రీమేక్ వ్యవహారం ముదిరిపాకాన పడిన విషయం తెలిసిందే. రచయిత నరసింహారావు నుంచి ఫిర్యాదు అందుకున్న కథా వేదిక ఛైర్మన్, దర్శకరత్న దాసరి, ఈ సినిమాకు ఏ విధమైన సహాయ సహకారాలు అందించరాదని నిర్మాతల మండలికి సూచించారు. ఈ నేపధ్యంలో సినిమా ఇబ్బందుల్లో పడుతోందని భావించిన మెగాస్టార్, దీనికి ఫుల్స్టాప్ పెట్టేందుకు పవన్ చెంతకు చేరారని టాక్.
దాసరి – పవన్ ల మధ్య మంచి సత్సంబంధాలు ఉన్న విషయం తెలిసిందే. పవర్స్టార్తో సినిమాను నిర్మించనున్న దాసరితో, తన తమ్ముడు ద్వారా ఆయనకు సర్దిచెప్పటానికే చిరు ఈ సెట్స్ ను సందర్శించారన్న కామెంట్స్ సోషల్ మీడియాలో పడిపోతున్నాయి. మరి ఇందులో వాస్తవమెంతో తెలియదు గానీ, “కత్తి” రీమేక్ ఉదంతం వెలుగులోకి రావడం, ఆ వెంటనే మెగాస్టార్ “సర్ధార్” సెట్స్ కు వెళ్ళడంతో ఈ వార్తలకు బలం చేకూరినట్లయ్యింది. ఈ తరహా గాసిప్స్కి మెగా క్యాంప్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి?