‘బ్రహ్మోత్సవం’ సినిమాపై ప్రముఖ దినపత్రిక రాసిన కధనపు ప్రకంపనలు ముగియక ముందే, ఓ తెలుగు న్యూస్ ఛానల్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులపై ఓ ప్రత్యేకమైన కార్యక్రమాన్ని ప్రసారం చేసింది. ‘ఒక మనసు’ ఆడియో వేడుకపై ఇటీవల అల్లు అర్జున్ చేసిన అంశాలను ప్రస్తావిస్తూ సాగిన ఈ కార్యక్రమంలో గతంలో జరిగిన మెగా వేడుకలు… ఆయా వేడుకలపై ప్రముఖుల ప్రసంగాలు… పవన్ కళ్యాణ్ ను కీర్తించడాలు… అభిమానులు ఉప్పొంగడాలు… వంటి వీడియోలను ప్రసారం చేసింది.
అలాగే పవన్ ఫ్యాన్స్ పై వివిధ ఈవెంట్లలో మండిపడ్డ నాగబాబు, అల్లు అర్జున్ వైనాన్ని ప్రస్తావిస్తూ… ఎవరెన్ని చెప్పినా… చివరగా పవన్ అభిమానులు మారనంత వరకు ఈ తీరు ఇలాగే కొనసాగుతుంది… మారాల్సింది హీరోలు కాదు.., పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రమే… ఈ కధనానికి ముగింపు పలికిన సదరు ఛానల్.., ‘అసలు పవన్ ఫ్యాన్స్ మారతారా..?’ అంటూ మరో శేష ప్రశ్నను కూడా మిగిల్చింది. పొగిడినంత సేపు కేరింతలు కొట్టే అభిమానులు… అతిథుల చేత బలవంతంగా ఎలా పవన్ నామస్మరణ చేయిస్తున్నారో సదరు కధనంలో ప్రసారమైన వీడియోల ద్వారా వీక్షకులకు స్పష్టంగా చూపించారు.
ఓ పక్కన సోషల్ మీడియాలో ఇటీవల ‘బ్రహ్మోత్సవం’ విడుదల సందర్భంలో కూడా వ్యతిరేక ప్రచారం చేసిన ‘అపవాదు’ను మూటగట్టుకున్న పవన్ అభిమానులు… పరోక్షంగా ఓ టీవీ యాంకర్ ద్వారా ఇటీవల ఫేస్ బుక్ వేదికగా అక్షింతలు వేయించుకున్నారు. తాజాగా మరొక మీడియా కధనం. ఏదొక టాపిక్ తో ఏదొక వివాదంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎప్పుడూ హాట్ టాపిక్ గా నిలవడం గమనించదగ్గ అంశం.