Palle Raghunatha Reddy“అవినీతిలో మాత్రం సామ్రాట్… రాజకీయాల్లో మాత్రం బచ్చా…” అంటూ టిడిపి సీనియర్ నేత, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పల్లె రఘునాధరెడ్డి మినీ మహానాడు వేదికగా భీకర స్వరం వినిపించారు. ఒక తెలుగుదేశం నేత ఇంతగా మండిపడే వ్యక్తి ఎవరో కాదు, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి గురించే అని ఊహిస్తే… అందులో ఎలాంటి పొరపాట్లు లేవు. అవును… వైసీపీ అధినేతపై మంత్రివర్యులు ఓ రేంజ్ లో మండిపడ్డారు.

దేశంలోనే అతి పెద్ద అవినీతి పరుడైన జగన్ 11 కేసుల్లో నిందితుడిగా ఉంటూ మీడియా వేదికగా ‘శ్రీరంగ నీతులు’ చెబుతున్నారని ధ్వజమెత్తారు. పట్టిసీమను నిర్మిస్తే వైసీపీకి ఉనికి ఉండదన్న ఉద్దేశంతోనే దానిని అడ్డుకుంటూ ‘రాయలసీమ ద్రోహి’గా మారారని విమర్శలు గుప్పించారు. ప్రభుత్వం ఎలాంటి సంక్షేమ పధకం ప్రవేశపెట్టినా… దానిపై విషప్రచారం చేయడం, అవగాహన లేని విమర్శలు చేయడం వైసీపీకి పరిపాటిగా మారిపోయిందని ఆగ్రహించారు.

రాజకీయాల్లో విమర్శలు సహజమే అయినా… తాజాగా మంత్రి పల్లె చేసిన విమర్శలు సోషల్ మీడియాలో సందడి చేయడానికి కారణమయ్యాయి. త్రివిక్రమ్ డైలాగ్స్ మాదిరి ప్రాస, పంచ్ లతో కూడిన విమర్శలు నెటిజన్లను ఆకర్షిస్తున్నాయి. దీంతో సోషల్ మీడియాలో ‘అవినీతి సామ్రాట్… పొలిటికల్ బచ్చా…’ అంటూ వైసీపీ అధినేతపై సెటైర్లు పడుతున్నాయి.