మరో నాలుగు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న “జనతా గ్యారేజ్” సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు ఊపందుకున్నాయి. ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియాలలో ‘జనతా గ్యారేజ్’ చిత్ర యూనిట్ మోత మోగిస్తోంది. ఇందులో భాగంగా ఓ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘యంగ్ టైగర్’ తన అనుభూతులను పంచుకున్నారు. ముఖ్యంగా అభిమానులు ఎంతగానో అంచనాలు పెట్టుకున్న ఈ సినిమాపై ఇప్పటికే ఆడియో వేడుకలో ‘బ్లాక్ బస్టర్’ అని డిక్లేర్ చేసిన నేపధ్యంలో… ఆ రేంజ్ ను అందుకుంటుందా? అన్న ప్రశ్నపై…
‘బాగుంటుంది అన్న నమ్మకం అయితే ఉంది గానీ, ఎంత బాగుంటుంది అన్న విషయం మాత్రం ప్రేక్షకులే చెప్పాలి, బాగుంటుందన్న నమ్మకంతోనే ఆనాడు ఆడియో వేడుకలో అలా స్పందించాము తప్ప ఓవర్ కాన్ఫిడెన్స్ తో మాత్రం కాదు, ఖచ్చితంగా ఆదరిస్తారనే నమ్మకం అయితే ఉంది’ అంటూ “జనతా గ్యారేజ్” ఫలితంపై విశ్వాసం వెలిబుచ్చిన జూనియర్ ఎన్టీఆర్ మరో మాట కూడా ఈ సందర్భంగా అన్నారు.
‘ఏమో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు కదా, అన్ని సార్లు మనం అనుకున్నవి జరగవు కదా, చూద్దాం మరో మూడు రోజుల్లో ఏం జరుగుతుందో’ అంటూ కాస్త వేదాంతధోరణిలో వ్యాఖ్యానించారు. ‘జనతా గ్యారేజ్’ సినిమాలో కధే బలమని, అందులో తాము పాత్రలు మాత్రమే పోషించామని, ప్రతి పాత్ర కధలో నుండి, స్క్రిప్ట్ డిమాండ్ చేయగా వచ్చిందే గానీ ఏది అసహజంగా ఉండదని చెప్పిన ఎన్టీఆర్ వ్యాఖ్యలలో మునుపటితో పోలిస్తే… కాస్త మార్పు కనపడుతోంది.