కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాల విషయంలో… కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామి అయిన ఏపీ ప్రభుత్వం ఎంత నిరుత్సాహంగా ఉందో, మోడీ ప్రభుత్వంతో భాగస్వామి కాని తెలంగాణా సర్కార్ కూడా అంతే నిట్టూర్పును ప్రదర్శిస్తున్న వైనం తెలిసిందే. దీనికి తోడు తాజాగా రెండు తెలుగు రాష్ట్రాలు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న ఓ అంశంపై కేంద్రం నీళ్ళు జల్లింది. రాజ్యసభలో తెలుగుదేశం ఎంపీ దేవేందర్ గౌడ్ అడిగిన ప్రశ్నకు, కేంద్ర హోం శాఖ నుండి వచ్చిన సమాధానం రాజకీయ నాయకులకు షాక్ ఇచ్చినట్లయ్యింది.
‘తెలుగు రాష్ట్రాల్లో శాసనసభ స్థానాలు పెంచే ప్రసక్తే లేదని, అసెంబ్లీ సీట్ల పెంపు ప్రతిపాదన తమ పరిశీలనలో లేదని’ కుండబద్దలు కొట్టింది. 2026 తర్వాతే నియోజక వర్గాల పునర్వ్యస్థీకరణకు అవకాశం ఉందని పేర్కొనడంతో రెండు రాష్ట్ర ప్రభుత్వాలు డీలా పడినట్టు కనిపిస్తోంది. శాసనసభ స్థానాల సంఖ్య పెరిగితే లాభపడవచ్చని భావించి అధికార పార్టీ తీర్థం పుచ్చుకుంటున్న ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలకు కేంద్రం ప్రకటనతో నోట్లో పచ్చివెలక్కాయ పడినట్టు అయింది.
తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపుపై కేంద్ర హోంశాఖ కేంద్ర న్యాయశాఖ అభిప్రాయాన్ని కోరిందా? అదే జరిగితే ఆ వివరాలేంటి? అంటూ టిడిపి ఎంపీ దేవేందర్ గౌడ్ అడిగిన ప్రశ్నకు…. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి హన్స్రాజ్ గంగారాం, ఆర్టికల్ 170ని సవరించకుండా పెంపు సాధ్యం కాదని, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014లోని సెక్షన్ 26లో ఒక రకంగా, రాజ్యాంగంలోని ఆర్టికల్ 170లో మరో రకంగా ఉన్నాయని, ఈ రెండూ సంఘర్షించుకుంటే ఏది చెల్లుబాటు అవుతుందనే విషయంపై న్యాయశాఖ సలహా కోరినట్టు లిఖిత పూర్వక సమాధానంలో పేర్కొన్నారు.
ఆర్టికల్ 170ని సవరించకుండా ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014లోని సెక్షన్ 26ను సవరించి సెక్షన్ 26(1)ను అమలు చేయలేమని భారత అటార్నీ జనరల్ అభిప్రాయపడినట్టు తెలిపారు. ఆర్టికల్ 170లోని ‘నిబంధనలకు లోబడి’ అన్న వాక్యానికి బదులు ‘నిబంధనలకు సంబంధం లేకుండా’ అన్న వాక్యం చేర్చి సవరించినా ప్రయోజనం ఉండదని అటార్నీ జనరల్ చెప్పినట్టుగా మంత్రి పేర్కొన్నారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న తర్వాతే సీట్ల పెంపు విషయంలో వెనక్కి తగ్గినట్టు వివరించారు.