ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లాలో బుర్రిపాలెం గ్రామంలో కుటుంబ సభ్యులతో సహా పర్యటించి, గ్రామాభివృద్ధికి చర్యలు చేపడతామంటూ హామీ ఇచ్చిన ప్రిన్స్ మహేష్ బాబు సతీమణి నమ్రత తాజాగా తెలంగాణాలో ప్రిన్స్ దత్తత తీసుకున్న మహబూబ్ నగర్ జిల్లాలోని కొత్తూరు మండలం, సిద్దాపూర్ గ్రామంలో పర్యటించారు.
గ్రామంలో ‘హీల్ ఏ చైల్డ్’ పేరిట ఏర్పాటు చేసిన వైద్య శిభిరంలో 14 ఏళ్ల లోపు ఉన్న 300 మంది పిల్లలకు ఉచిత వైద్య పరీక్షలు చేయించిన నమ్రత, అందుకు అవసరమైన నివారణ చికిత్సలను కూడా చేయించారు. అనంతరం గ్రామంలోని వీధుల్లోకి వెళ్లి, గ్రామస్తుల నుండి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యలన్నింటినీ విడతల వారీగా పరిష్కరిస్తామని గ్రామస్తుల్లో ధైర్యం నింపారు.
నమ్రత పర్యటనతో గ్రామస్తుల్లో సంతోషం వెల్లివిరిసింది. అలాగే పిల్లల వైద్య పరీక్షల పట్ల పూర్తి సంతృప్తి వ్యక్తం చేసారు. సిద్దాపూర్ ను ‘మోడల్ విలేజ్’గా రూపకల్పన చేస్తామని నమ్రత చేసిన వ్యాఖ్యలు సిద్దాపూర్ వాసుల్లో గ్రామాభివృద్ది పట్ల నమ్మకం పెరిగింది.