match fixing on mahendra singh dhoniభారత క్రికెట్ అభిమానులనే కాదు, యావత్తు ప్రపంచ క్రికెట్ నే కుదిపేసే ఆరోపణ వ్యక్తమయ్యింది. జెంటిల్మెన్ గేమ్ లో అసలు సిసలు జెంటిల్మెన్ లా వ్యవహరించే టీమిండియా రధసారధి మహేంద్ర సింగ్ ధోనిపై తొలిసారిగా మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఆరోపణలు చేసింది మరెవరో కాదు, ఒకప్పుడు (ధోని టెస్ట్ కెప్టెన్ గా ఉన్నపుడు) భారత జట్టును మేనేజర్ గా వ్యవహరించిన వారే కావడంతో మరింత ప్రాధాన్యత దక్కింది.

2014వ సంవత్సరంలో ఇంగ్లాండ్ పర్యటన సందర్భంగా మాంచెస్టర్ లో జరిగిన టెస్ట్ మ్యాచ్ ఫిక్స్ అయ్యిందని నాటి టీమిండియా మేనేజర్, ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ) కార్యదర్శి సునీల్ దేవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రముఖ హిందీ దినపత్రిక ‘సన్ స్టార్’ చేసిన స్టింగ్ ఆపరేషన్ లో భాగంగా అనిల్ దేవ్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి.

ఇన్నింగ్స్ తేడాతో ఓడిపోయిన ఆ మ్యాచ్ లో టీమిండియా కెప్టెన్ గా ఉన్న మహేంద్ర సింగ్ ధోనీనే తీసుకున్న నిర్ణయాన్ని ప్రధానంగా ఎత్తి చూపుతున్నారు. “వర్షం కారణంగా పిచ్ పరిస్థితి దృష్ట్యా టాస్ గెలిస్తే తొలుత బౌలింగ్ ఎంచుకోవాలని జట్టు సమావేశంలో నిర్ణయించాం. కానీ ధోనీ అనూహ్యంగా మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దీంతో ఆశ్చర్యానికి గురయ్యా. ధోనీ నిర్ణయాన్ని చూసి ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జెఫ్రీ బాయ్ కాట్ కూడా షాకయ్యాడు. ఈ విషయాన్ని బీసీసీఐ దృష్టికి కూడా తీసుకెళ్లా. అలాగే అప్పటి బోర్డు చీఫ్ ఎన్. శ్రీనివాసన్ కు కూడా లేఖ రాశా. అయితే దీనిపై ఇప్పటివరకు బోర్డు స్పందించలేదు’’ అని అనిల్ దేవ్ పేర్కొన్నాడు. దేవ్ వ్యాఖ్యలతో కూడిన ఈ వీడియోను సదరు హిందీ డైలీ ఢిల్లీలోని భారత ప్రెస్ క్లబ్ లో ప్రదర్శించింది.