Mahesh babu launches kshanam railerప్రముఖ పివిపి సంస్థ నిర్మించిన “క్షణం” సినిమా ట్రైలర్ ప్రిన్స్ మహేష్ బాబు, సమంత చేతుల మీదుగా విడుదలైంది. అడవి శేష్, ఆదా శర్మ, అనసూయ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టైటిల్ కు తగ్గట్లే థ్రిల్లర్ కధాంశంతో రూపొందింది.

తన కూతురును తప్పిపోయింది, వెతికి పెట్టడంలో సహాయం చేయాలని అడవి శేష్ ను మాజీ ప్రేమికురాలు ఆదా శర్మ అడగడంతో ప్రారంభమైన ట్రైలర్… అసలు నీకు కూతురు ఉందా..? అంటూ అడవి శేష్ తిరిగి ఆదా శర్మను అడగడంతో ముగుస్తుంది. ఎన్నారై గా అడవి శేష్ కనపడుతుండగా, పోలీస్ ఆఫీసర్ పాత్రలో అనసూయ ఓ డిఫరెంట్ లుక్ లో దర్శనమిస్తోంది. ఒక తల్లిగా మరియు కాలేజ్ గర్ల్ గా ఆదా శర్మ “క్షణం”లో కనువిందు చేయనుంది.

ఈ ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగడంతో సినిమాపై ప్రేక్షకుల్లో ఉత్సుకత నెలకొంది. అలాగే సాంకేతిక విభాగాలకు వచ్చే సరికి షానిల్ డియో సినిమాటోగ్రాఫీ, శ్రీచరణ్ పాకల బ్యాక్ గ్రౌండ్ సంగీతం ఆకట్టుకుంటాయి. మార్చి 4వ తేదీన విడుదల చేయబోతున్న సినిమాకు రవికాంత్ పెరేపు దర్శకత్వం వహించారు. ఇతర పాత్రలో ‘సత్యం’ రాజేష్, సత్య దేవ్ తదితరులు నటించారు.