ప్రిన్స్ మహేష్ బాబు ప్రస్తుతం తమిళ దర్శకుడు మురుగదాస్ తెరకెక్కిస్తున్న సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా తర్వాత ఎవరితో జత కడతారు? అన్న ప్రశ్నకు ప్రస్తుతం సమాధానం లభించింది. ఇప్పటివరకు హల్చల్ చేసిన అనేక దర్శకుల పేర్లను పక్కనపెడుతూ… ‘శ్రీమంతుడు’ వంటి భారీ హిట్ ను అందించిన కొరటాల శివ దర్శకత్వంలో ప్రిన్స్ 24వ సినిమా రూపొందనుంది. దీనికి సంబంధించి ప్రొడక్షన్ సంస్థ నుండి ఒక అధికారిక ప్రకటన వెలువడింది.
‘మెగా’ సినిమాల నిర్మాత డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ జనవరిలో ప్రారంభం కాబోతుందని నిర్మాణ సంస్థ నుండి వెలువడిన సమాచారం మహేష్ అభిమానుల్లో మరింత టెన్షన్ పెంచుతోంది. దీనికి కారణం ప్రిన్స్ తో కొరటాల శివ రెండవ సారి జత కట్టడమే! ఇటీవలే ‘బ్రహ్మోత్సవం’ వంటి చేదు అనుభవాన్ని శ్రీకాంత్ అడ్డాల చవిచూపించిన నేపధ్యంలో… రెండవసారి ప్రిన్స్ తో జతకట్టడమంటే అతి పెద్ద రిస్క్ తీసుకున్నట్లుగానే అభిమానులు భావిస్తున్నారు.
ఒక్క పూరీ జగన్నాధ్ తప్ప హేమాహేమీ దర్శకులైన త్రివిక్రమ్, గుణశేఖర్, శ్రీనువైట్ల లు కూడా ప్రిన్స్ తో పరాజయాలు అందుకోవాల్సి వచ్చింది. దీంతో మళ్ళీ కొరటాల శివ అనే పాటికి ముందుగా ‘శ్రీమంతుడు’ సంతోషం గుర్తుకు వస్తున్నా… తర్వాత ఏమవుతుందో అన్న భయం ఎక్కువగా వ్యక్తమవుతోంది. అయితే ఈ ప్రకటనతో కొరటాల నెక్స్ట్ ప్రాజెక్ట్ పై కూడా స్పష్టత వచ్చినట్లే చెప్పవచ్చు. చెర్రీ, అఖిల్ అంటూ హల్చల్ చేసిన పుకార్లకు స్వస్తి పలుకుతూ… ‘జనతా గ్యారేజ్’ తర్వాత కొరటాల ప్రాజెక్ట్ ప్రిన్స్ దే కావడం విశేషం.