ఈ ఏడాది సంక్రాంతి పండుగకు విడుదలైన నాలుగు సినిమాలు బాక్సాఫీస్ వద్ద బాగానే సందడి చేసి అటు నిర్మాతలకు, ఇటు సినీ పరిశ్రమకు నూతన ఉత్సాహాన్నిచ్చాయి. కలెక్షన్స్ లో భారీ తేడాలు ఉన్నప్పటికీ ఆయా చిత్రాల బడ్జెట్ లను దృష్టిలో పెట్టుకుంటే అన్ని సినిమాలకు పర్వాలేదనిపించే స్థాయిలోనే వసూళ్ళు ఉన్నాయని సినీ పండితులు చెప్తున్నారు.
అయితే ఈ నాలుగు సినిమాల శాటిలైట్ హక్కులను ఒక ఛానల్ సొంతం చేసుకోవడం మరింత విశేషం. ఇటీవల కాలంలో మా టీవీకి గట్టి పోటీనిస్తున్న జెమిని టెలివిజన్ ఈ నాలుగు సినిమాల హక్కులను సొంతం చేసుకున్నట్లుగా తెలుస్తోంది.
మొదటగా జూనియర్ ఎన్టీఆర్ “నాన్నకు ప్రేమతో” 7.5 కోట్లకు కొనుగోలు చేయగా, ఆ తర్వాత నాగ్ కెరీర్లో అత్యంత భారీ హిట్ గా నమోదైన “సోగ్గాడే చిన్ని నాయన” 6.5 కోట్లు కొల్లగొట్టిందని టాక్. ఇక, నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన “డిక్టేటర్” 6.20 కోట్లను చెల్లించి హక్కులను సొంతం చేసుకుగా, ఫైనల్గా శర్వానంద్ ‘ఎక్స్ప్రెస్ రాజా’ను 3.25 కోట్లతో దక్కించుకుందట. ఇలా దేనికదే సెపరేట్ కావడంతో ఆ ఛానల్ పంట పండిందని అంటున్నారు.