అనుష్క ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘సైజ్ జీరో’ చిత్రం తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయింది. దాంతో ఈ సినిమాకు ప్రేక్షకులు కరువయ్యారు. దానికి తోడు ఈ సినిమా విడుదలకు ముందు వారం విడుదల అయిన ‘కుమారి 21ఎఫ్’ చిత్రం సూపర్ హిట్ టాక్ను తెచ్చుకుంది. దాంతో ‘సైజ్ జీరో’కు కలెక్షన్స్ చాలా తక్కువగా వస్తున్నాయి. మొదటి వారంలోనే ఇలాంటి కలెక్షన్స్ వస్తే రెండవ వారంలో థియేటర్లలో సినిమా ఉండేది అనుమానమే అంటూ ట్రేడ్ వర్గాల వారు అంటున్నారు.
ఈ సినిమా కోసం అనుష్క దాదాపుగా 20 కేజీల బరువు పెరిగిన విషయం తెల్సిందే. ఒక స్టార్ హీరోయిన్ చేయకూడని సాహసం చేసి అనుష్క ఈ సినిమాలో నటించింది. కాని ఆమె బరువుకు ఫలితం లేకుండా పోయింది. ఈమె అంత కష్టపడి బరువు పెరిగినా కూడా దర్శకుడు ప్రకాష్ కోవెలమూడి ఈ సినిమాను ప్రేక్షకులను ఆకట్టుకునేలా తెరకెక్కించడంలో విఫలం అయ్యాడు. కథ వైవిధ్యంగా ఉన్నప్పటికి తెరకెక్కించిన తీరు ప్రేక్షకులను మెప్పించలేదు. అనుష్క లావుపైన మరియు సొనాల్ చౌహాన్ గ్లామర్పైనే ఎక్కువ దర్శకుడు ప్రకాష్ దృష్టి పెట్టినట్లుగా సినిమా చూస్తే అర్థం అవుతుంది.
ఇంత కష్టపడి చేసిన ‘సైజ్ జీరో’ సినిమా ప్రేక్షకుల తిరస్కరణకు గురి అవ్వడంతో అనుష్క చాలా ఫీల్ అవుతుందట. ప్రస్తుతం ఈమె ‘బాహుబలి’ కోసం బరువు తగ్గే పనిలో ఉంది. ‘సైజ్ జీరో’ పోయినా ‘బాహుబలి’తో అనుష్కకు బ్లాక్ బస్టర్ ఖాయం అని, బాధ పడాల్సిన అవసరం లేదు అని ఆమె అభిమానులు అంటున్నారు.