టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క ఈ వారం ‘సైజ్ జీరో’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. ఈ సినిమా కోసం అనుష్క ఏకంగా 20 కేజీలకు పైగా బరువు పెరిగినట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు. చిత్రీకరణ పూర్తి అయిన తర్వాత బరువు తగ్గేందుకు అనుష్క అష్ట కష్టాలు పడుతుందని, ఎంత కష్టపడ్డా కూడా 5 నుండి 7 కేజీలు మాత్రమే తగ్గిందంటూ మీడియాలో వార్తలు వస్తున్నాయి. వెంటనే బరువు తగ్గేందుకు అనుష్క అమెరికాలో లైపో చేయించుకోవాలని నిర్ణయించుకున్నట్లుగా కొన్ని రోజులుగా మీడియాలో పుకార్లు షికారు చేస్తున్నాయి.
మీడియాలో వస్తున్న వార్తలపై తాజాగా ‘సైజ్ జీరో’ ప్రెస్ మీట్లో స్పందించింది. బరువు తగ్గేందుకు ఆపరేషన్ చేయించుకోబోతున్నట్లుగా వస్తున్న వార్తల్లో నిజం లేదని, తాను కేవలం సరైన డైట్ ఫాలో అవ్వడం మరియు యోగా వల్లే బరువు తగ్గుతున్నాను అంటూ చెప్పుకొచ్చింది. పెరిగిన బరువులో ఇప్పటికే సగానికి పైగా తగ్గాను అని, త్వరలోనే మరింతగా బరువు తగ్గుతాను అంటూ అనుష్క చెప్పుకొచ్చింది. అనుష్క త్వరలో ‘బాహుబలి’ రెండవ పార్ట్ చిత్రీకరణలో పాల్గొనాల్సి ఉంది. అందుకోసం మునుపటి రూపంను చాలా తక్కువ సమయంలో తెచ్చుకోవాల్సి ఉంది. మరో వైపు ఈమె మరో రెండు హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రాలకు ఓకే చెప్పింది అంటూ వార్తలు వస్తున్నాయి.