బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలు దేశ వ్యాప్తంగా పెను దుమారంను రేపిన విషయం తెల్సిందే. ఆ వ్యాఖ్యలు దేశ ప్రతిష్టను దెబ్బ తీసేవిగా ఉన్నాయని, అమీర్ ఖాన్ దేశ ద్రోహి అంటూ పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దాంతో తన వ్యాఖ్యలపై వస్తున్న విమర్శలపై అమీర్ ఖాన్ స్పందించాడు. తాను భారత దేశాన్ని విడిచి పెట్టే ప్రసక్తే లేదని, దేశం తనకు ఎంతో ఇచ్చిందని అన్నాడు.
తన వ్యాఖ్యలు పూర్తిగా చదవని వారు తనపై విమర్శలు చేస్తున్నారని అన్నాడు. తాను దేశంలోని ప్రజలు అంతా కూడా సోదర భావంతో ఉండాలని అనుకుంటున్నాను అని, తన దేశ భక్తి గురించి ప్రత్యేకంగా ఇప్పుడు నిరూపించుకోవాల్సిన అవసరం లేదని, తానో గొప్ప దేశ భక్తుడిని అని అమీర్ చెప్పుకొచ్చాడు. తాను కాని, తన భార్య కాని దేశాన్ని విడిచి పెట్టి వెళ్లేది లేదు అని ఈయన చెప్పుకొచ్చాడు. అయితే తాను చేసిన వ్యాఖ్యలకు ఇప్పటికి కూడా కట్టుబడే ఉన్నాను అని అమీర్ పేర్కొన్నాడు. తాను దేశాన్ని కించపర్చే విధంగా మాట్లాడలేదు అని, తన వ్యాఖ్యలను ఒక్క కోణంలో చూసే వారికి అలా అనిపిస్తుందని అమీర్ చెప్పుకొచ్చాడు. అమీర్ వివరణ ఇచ్చినా కూడా ఆయనపై విమర్శలు వస్తూనే ఉన్నాయి.