savitri daughter vijaya chamundeswariతెలుగింటి ఆడపడుచు సావిత్రి గురించి తెలియని సినీ అభిమాని ఉండడంటే అతిశయోక్తి కాదు. కేవలం తెలుగే కాదు…. తమిళ, కన్నడ, మలయాళ సినిమాల్లో ఆమె తిరుగులేని స్టార్ గా వెలుగొందిన నటీమణి సావిత్రి. అయితే చివరి రోజుల్లో మద్యానికి బానిసై దుర్భర జీవితాన్ని చవిచూశారని, ఆస్తులున్నీ హారతి కర్పూరంలా కరిగిపోయాయని సావిత్రి గురించి భిన్న కథనాలు ప్రచారంలో ఉన్నాయి. ఇలాంటి వాటిపై సావిత్రి కుమార్తె విజయ చాముండేశ్వరి బాహ్య ప్రపంచానికి తెలియని విషయాలను వెల్లడించారు.

ఒక ఆంగ్ల పత్రికకు ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… తనకు 16 ఏళ్ల వయసులో తన తల్లిదండ్రులు వివాహం చేశారని తెలిపారు. తన వివాహానికి రెండేళ్ల ముందే అమ్మ (సావిత్రి), నాన్న (జెమినీ గణేషన్) ల మధ్య విభేదాలు తలెత్తాయని తెలిపారు. అయితే వారి మధ్య ఏం జరుగుతోందో? ఎందుకు గొడవలు వస్తున్నాయో? కూడా అర్థమయ్యేది కాదని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే వారి మధ్య ఎన్ని విభేదాలు ఉన్నప్పటికీ ఇద్దరూ తనతో ప్రేమగా ఉండేవారని ఆమె గుర్తు చేసుకున్నారు.

తన తండ్రి ఇంట్లో ఉండకపోయినా… తనతో టచ్ లో ఉండేవారని, తాను వారి దగ్గరకు వెళ్లేదానినని తెలిపారు. ఆ తరువాతే అసలు ఏం జరుగుతోంది? ఎందుకు విభేదాలు మొదలయ్యాయో తెలిసేదని చెప్పారు. ఆ విభేదాల వల్ల తనకు ఎక్కువ నష్టం జరగకపోయినా… తన తమ్ముడు మాత్రం ఇబ్బంది పడ్డాడని అన్నారు. అయితే అతను పెరిగి పెద్దయ్యే సరికి ఆ విభేదాలన్నీ సమసిపోయాయని చెప్పారు. ఇక తన తల్లి విషయానికొస్తే… ఆమె చాలా అమాయకురాలని అభిప్రాయపడ్డారు.

కనీసం సమస్యలను ఎలా డీల్ చేయాలో కూడా తన తల్లికి తెలిసేది కాదని, ఆమె అమాయకత్వమే చాలా చెడు చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ సమయంలో సరైన గైడెన్స్ కూడా లేదని, అందుకే ఆమె మద్యానికి బానిసయ్యారని, ఆ తరువాత సుమారు 19 నెలలు కోమాలోనే ఉండిపోయారని, అమ్మ తిరిగి బతుకుతుందని తాము ఎన్నో ఆశలు పెట్టుకున్నామని, అయితే తమ ఆశలు వమ్మయ్యాయని కన్నీటి పర్యంతమయ్యారు. తన తల్లిని 19 నెలలు ఆసుపత్రి బెడ్ పై చూడడం నరకంలా అనిపించేందని తెలిపారు.

ఈ సమయంలో తన తండ్రి అనుభవించిన వేదన అంతా ఇంతా కాదని, అమ్మను అలా చూసి చలించిపోయారని విజయ చాముండేశ్వరి గుర్తు చేసుకున్నారు. ఇక ఆమె ఆస్తులుపై ఉన్న కథనాలు తప్పుడు కథనాలని… ఆమె చనిపోయాక కూడా తాము ఎలాంటి ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోలేదని అన్నారు. ఆమె ఎంత పోగొట్టుకున్నా, అంతకంటే ఎక్కువే సంపాదించారని, ఈ రోజు కూడా తన తల్లి సంపాదించిన సంపాదనతో జీవితాన్ని హాయిగా గడిపేయొచ్చని తెలిపారు.

తన తల్లి గురించి భావి తరాలకు తెలియాలన్న ఆలోచనతోనే ఆమె బయోపిక్ కు అంగీకరించానని, అలాగే ఆమె ఎదిగిన విధానం, ఆమె స్టార్ గా వెలుగొందిన వైనంపై తీస్తానన్న షరతుతోనే బయోపిక్ కు అంగీకరించానని, స్క్రిప్టు కూడా ముందు చదవాలని షరతు పెట్టానని తెలిపారు. తన తల్లి జీవితం చాలామందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని, ఆమె జీవితంలోని కీలక ఘట్టాలు అందరికీ తెలిసి తీరాలని, ఈ బయోపిక్ బాగా వస్తుందన్న నమ్మకం తనకుందని అభిప్రాయపడ్డారు.